చేకూరపాడులో చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయముపై ఆధారపడిన సుమారు అప్పట్లో వంద కుటుంబాలు నివసించేవారు, వారితో పాటు దళితవాడ, ఇతర వృత్తుల వారు రైతులకు వ్యవసాయములో సహకరిస్తూ జీవనోపాధి సాగించేవారు . కనీస మౌలిక వసతులు, రవాణా సౌకర్యం లేని మారుమూల పల్లెటూరు, సమీప గ్రామాలకు పనుల నిమిత్తం వెళ్లాలంటే డొంక రోడ్ల ద్వారానే రాక పోకలు కొనసాగించేవారు. బాలబాలికలు చదువు కోవాలంటే ప్రాధమిక పాఠశాల మాత్రమే ఉండేది విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించడానికి డొంక రోడ్ల ద్వారానే సమీప గ్రామాలైన కరవాది లేక అమ్మనబ్రోలు కు అనేక కష్టాలు పడి చేరుకోవాల్సి వచ్చేది.

అందువలన అప్పట్లో చదువుకొనే వారి సంఖ్య చాలా తక్కువ ఉండేది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు పడుతున్నకష్టాలు ప్రత్యక్షంగా చూసిన శిరిగిరి పేరయ్య గారు సొంత ఊరిలో ఉన్నత పాఠశాలను నెలకొల్పాలనే ఆలోచనను తెలియజేయగా గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా,సమిష్టిగా శ్రమదానం చేయడమే కాకుండా తమవంతు విరాళాలు అందజేశారు.

శ్రీ వేణు గోపాల స్వామి ఓరియంటల్ పాఠశాలకు మెయిన్ బిల్డింగ్ వెనుక వైపు ఉన్న స్థలాన్ని కీర్తి శేషులు శిరిగిరి వెంకట్రావు గారు వారి అమ్మమ్మ ద్వారా సంక్రమించిన భూమిని ఉచితంగా పాఠశాలకు ఇచ్చారు. వారి పేరు ప్రతిష్టలు మన పాఠశాల ఉన్నంతవరకూ మరువలేనివి.

మెయిన్ బిల్డింగు ను పంచాయతీ సమితి వారు ఎలిమెంటరీ పాఠశాల కొరకు నిర్మించారు. భవనాన్ని నిర్మించి పాఠశాల ప్రారంభించుటకు సమయము సరిపోనందున సమితి ప్రెసిడెంట్ మోపర్తి పున్నయ్య గారిని సంప్రతించి వేరే చోట ఎలిమెంటరీ పాఠశాలను తాము నిర్మించి ఇస్తామని, ఒప్పించి ఈ భవనాన్ని తీసుకొన్నారు. తరువాత ఇప్పుడు ఎలిమెంటరీ పాఠశాల ఉన్న స్థలాన్ని కొని భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఈ స్థలములో భవన నిర్మాణములకు సహకరించిన గ్రామ రైతులనుంచి శిరిగిరి పేరయ్య గారు డబ్బును వసూలు చేసి పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం గావించారు. శిరిగిరి పేరయ్య గారు ఆ రోజులలో పొగాకు వ్యాపారము చేసేవారు. వారి పలుకుబడితో తోటి వ్యాపారస్తుల నుంచి కూడా కొంత డబ్బును సేకరించి భవన నిర్మాణంకు తోడ్పడినట్లుగా తెలిసింది. వారి ఆలోచన సంకల్పంతో గ్రామ రైతులు భాగస్వాములై అన్ని విధాలా సహకరించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసారు. అప్పటి వరకు ఎలిమెంటరీ పాఠశాలను శిరిగిరి రాఘవులు గారి కొష్టంలో కొనసాగించారు.

ఈ రోజు వరకు పాఠశాల నిర్వహణకు గ్రామస్తులు చూపిన మార్గములోనే ఎలాంటి అవాంతరాలు లేకుండా వివిధ కమిటీలలోని పని చేసిన సభ్యులు అందరూ పూజ్యనీయులు.

శిరిగిరి పేరయ్య గారు పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి కావలిసిన అనుమతుల కోసం తన మిత్రులు స్వర్గీయ శ్రీ ధారా గోపాల శాస్త్రి గారు తో ప్రస్తావించగా కేంద్ర మంత్రి వర్యులు బెజవాడ గోపాల రెడ్డి గారు నాకు తెలుసని చెప్పి, స్వయంగా పాఠశాల అనుమతుల గురించి మంత్రి గారికి విన్నవించగా విద్యాశాఖాధికారులకు పరిశీలించమని సిపారస్సు చేసారు. ఆ రోజులలో ప్రభుత్వం వారు ప్రత్యేక గ్రాంటుతో సంస్కృత భాషాభివృద్ధికి పాఠశాలలను నెలకొల్పడం వలన దోహదపడగలదని భావించి పలు జిల్లాలలో సంస్కృత పాఠశాలలు, కళాశాలలను స్థాపించడం జరిగినది. ఉన్నతాధికారులు ప్రభుత్వం నుండి అనుమతులు , గ్రాంటు రూపములో నిధులు సంస్కృత పాఠశాల నెలకొల్పడం ద్వారా సులభమని అధికారులు సూచించడం జరిగినది. వారి సూచనతో గ్రామంలో శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఉండుటను దృష్టిలో ఉంచుకొని పాఠశాల పేరును శ్రీ వేణు గోపాల స్వామి ఓరియంటల్ హైస్కూల్ గా పాఠశాల కమిటీ వారు నిర్ణయించి ప్రభుత్వ నుండి అనుమతులకు దరఖాస్తు చేశారు. పాఠశాల మొదటి కరెస్పాండంట్ అయిన గ్రామ కరణం స్వర్గీయ శ్రీ ఉప్పలపాటి సత్యనారాయణ గారు పాలనాపరమైన అనుమతులు, నిధుల కోసం అవసరమైనపుడు హైదరాబాద్ లో ఉండి పనులు పూర్తి చేసుకొని వస్తూండేవారు.

ప్రభుత్వం నుండి శ్రీ వేణు గోపాల స్వామి ఓరియంటల్ ప్రాధమికోన్నత పాఠశాలగా అనుమతులు మంజూరు కావడముతో కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి గారి చేతుల మీదుగా 1962 సంవత్సరాన సెప్టెంబరు 7 వ తేదీన శుక్రవారం 4.00 గంటలకు ప్రారంభించబడింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారిని గ్రామ పురవీధులలో పూర్ణ కుంభం తో స్వాగతం పలికి పాఠశాల వరకు మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పూలతో అలంకరించిన వేదిక పైకి తీసుకోని వచ్చి సమీప గ్రామాలనుండి విచ్చేసిన అశేష ప్రజానీకం సమక్షంలో మంత్రి గారిని తదితర నాయకులను గ్రామస్తులు ఘనముగా సన్మానించడం జరిగినది.

ప్రకాశం జిల్లా లో స్థాపించిన మొట్టమొదటి ఎయిడెడ్ సంస్కృత పాఠశాలగా ప్రసిద్ధిగాంచినది. పాఠశాలను ప్రారంభాని కంటే ముందుగానే 1962 -63 విద్యా సంవత్సరానికి 6 వ తరగతిలో ప్రవేశానికి కి విద్యార్థులను చేర్చుకున్నారు కానీ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులను నియమించుకోలేకపోవడం వలన తల్లితండ్రులు ఆందోళనచెంది పిల్లలను వేరే స్కూల్ లో చేరుస్తామనగా పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులుగా PUC పూర్తి చేసిన స్వర్గీయ శ్రీ వడ్ఢేల్లి వీరయ్య గారు మరియు శిరిగిరి సుబ్బారావు గారు తమ వంతు సహాయముగా విద్యాభోధన చేశారు మొదటిగా ప్రధానోపాధ్యాయులు గా స్వర్గీయ శ్రీ మట్టా రామయ్య గారిని , రెండవ ఉపాధ్యాయునిగా శ్రీ వెల్ది వేంకటేశ్వర్లుగారిని అటు పిమ్మట కొంతమందిని .ఉపాధ్యాయులుగా నియమించుకోవడం జరిగినది.

పాఠశాలకు విద్యాశాఖ వారు అనుమతులు మంజూరు చేసినప్పటికీ, గ్రాంట్ నిధులు విడుదల చేయకపోవడము వలన కమిటీ వారు ఉపాధ్యాయులకు జీతములు ఇవ్వలేక పోయేవారు. కమిటీ వారి ఆర్ధికపరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయులు కూడా పాఠశాల నిర్వహణకు సహాయ చేశారు. శ్రీ సత్యనారాయణ పిళ్ళై గారు ప్రధానోపాధ్యాయులు గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలతో పాఠశాలకు రావలసిన గ్రాంట్ నిధులు రూ.60000 లను మంజూరు చేయించి పాఠశాల అభివృధికి ఆయన చేసిన కృషి మరువలేనిది.

విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ వెనుక వైపు ఉన్న స్థలం లో తాటిఆకులతో పూరి పాకను నిర్మించి తరగతి గదులను ఏర్పాటు చేసారు. ఆ తరువాత ఉత్తరం వైపు వెనుక బిల్డింగ్ నిర్మించారు. ప్రధానోపాధ్యాయులు గా .శ్రీ తన్నీరు గురవయ్య గారు పని చేస్తున్న సమయం లో పూర్వ విద్యార్థి ప్రవాస భారతీయులు శ్రీ నెప్పల సుబ్బా రాయుడు గారు పాఠశాల ఫై ఉన్న అభిమానంతో ఉత్తరం వైపు ముందు ఉన్న స్థలం లో రూ.6 లక్షల రూపాయలను విరాళాన్ని అందజేసి వారి తమ్ముడు పూర్వ విద్యార్థి శ్రీ నెప్పల కృష్ణ మూర్తి గారి పర్యవేక్షణలో శాశ్వత భవనాన్ని నిర్మించడం జరిగింది.

ఈ పాఠశాల పూర్వ విద్యార్థినీ విద్యార్థులు ప్రపంచము నలుదిశలా తమ ఉనికిని చాటుతుండడం ఈ పాఠశాల గొప్పదనానికి నిదర్శనం. మన పాఠశాల క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని గెలుపొందటం పాఠశాలకే గర్వకారణం.

పాఠశాల ప్రారంభించబడిన రోజు నుండి 61 సంవత్సరాలుగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా అందరి సహాయ సహకారాలతో దిన దినాభివుద్ది చెందుతూ ఎంతో మంది పరిసర గ్రామాల బాల బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ విజయపథంలో సాగుతూ భవిష్యత్ తరాల విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాలని కోరుకొంటూ, విశాల దృక్పధముతో గ్రామస్తులు నెలకొల్పబడిన పాఠశాలను అదే స్పూర్తి తో భవిష్యత్ తరాల వారు కూడా తమ వంతు సహాయము చేసినట్లయితే వారి ఆత్మకు శాంతి చేకూరగలదు.

శిరిగిరి తారకనాధ్, చేకూరపాడు

Note: మన పాఠశాల స్థాపించబడిన చరిత్ర గురుంచి తెలుసుకొనే ప్రయత్నం మా అన్నయ్య శిరిగిరి సుబ్బారావు మరియు కీర్తిశేషులు వడ్ఢేల్లి వీరయ్య చౌదరి గారు చెప్పగా వినిన తమ్ముడు శిరిగిరి విశ్వనాథం ద్వారా తెలుసుకోవడం జరిగింది.